||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పదియవ సర్గ ||

||హనుమంతుని ఆలోచన||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రింశస్సర్గః

తత్త్వదీపిక
హనుమంతుని ఆలోచన

శింశుపా వృక్షములో దాగి వున్న హనుమంతుడు
రాక్షసస్త్రీలచేత సీత భయపెట్టబడడము ,
త్రిజట స్వప్న వృత్తాంతము అన్నీ యథాతథముగా వింటాడు.
నందనవనములోని దేవతవలె నున్న ఆ సీతను చూచి
ఆ హనుమ అనేకవిధములుగా ఆలోచించసాగెను.
ఆ ఆలోచనలే ముప్పదియవ సర్గలో ముఖ్యభాగము.

ఇక్కడ హనుమంతుడు తనలో తాను అనుకుంటాడు.
అలాగ హనుమ అనుకునే మాటలే మనము వింటాము.
ఆ హనుమంతుని భాషణలలో అంతరార్థము బాహ్యార్థము కలిసిపోతాయి.
ఇక హనుమంతుని ఆలోచనలు మాటలు విందాము.

' ఏ సీత కొరకై వందలకొలదీ వేలకొలదీ వానరులు అన్ని దిశలలో వెదుకుతున్నారో
అట్టి సీతను నేను చూచితిని.
గూఢచారిలాగ తిరుగుతూ యుక్తితో శత్రువుల శక్తిని చూస్తూ
రాక్షసులగురించి, విశేషముగా ఈ నగరముగురించి,
అంతా అవగాహన చేసుకున్నాను.
ఈ రాక్షసాధిపతి రావణునియొక్క ప్రభావము కూడా చూచితిని.
ఇప్పుడు అన్ని ప్రాణులపై దయకలవాడు ,
అప్రమేయుడు అయిన ఆ శ్రీరాముని దర్శనము కోరుకొనుచున్న,
ఆ సీతమ్మని ఊరడించడము యుక్తము'.

'ఇప్పుడు దుఃఖముల అంతము కానరాక
అతి దుఃఖములో నున్న ఆమెకి ఆశ్వాసమిచ్చెదను.
ఒకవేళ దుఃఖములో మునిగిఉన్న ఆ దేవికి
నేను ఆశ్వాసమివ్వకుండా వెళ్ళిపోయినచో అది పొరపాటు అవును.
నేను అలా వెళ్ళిపోతే యశస్వినీ అగు రాజపుత్రి జానకి
తనకు రక్షింపబడు మార్గము కానరాక జీవితమే త్యజించును.
నేను ఈమె తో ఇప్పుడు మాట్లాడవలెను.
మాట్లాడి సీతను చూచుటకు తహతహలాడుతున్న రామునకు ఉపశమనము కలిగించుట న్యాయము.
కాని ఈ నిశాచరుల ముందర సంభాషణ మంచిదికాదు'.

'ఏమిటి నా కర్తవ్యము?
నాకు ఏమీ తోచకున్నది.
ఈ రాత్రి ఆమెకు ఆశ్వాసన ఇవ్వకపోతే ఆమె జీవితమును పరిత్యజించును.
అందులో సందేహము లేదు.
ఒకవేళ రాముడు నన్ను "నాకు సీత ఏమి చెప్పినది" అని అడిగినచో,
ఆ సుందరాంగితో మాట్లాడకుండా ఏమి సమాధానమిచ్చెదను ?
సీతాసందేశము లేకుండా ఇక్కడనుంచి త్వరగా వెళ్ళిన నన్ను
ఆ కాకుత్‍స్థుడు తీవ్రమైన కన్నులతో దహించివేయును.
ఆమె నిరాశతో ప్రాణములు త్యజించినచో,
సుగ్రీవుని ప్రేరణతో రాముడు సైన్యముతో కూడా వచ్చినచో ఆ పని వ్యర్థమగును.
అందువలన నేను ఇక్కడ కూర్చుని రాక్షసుల అంతరాయములేకుండా
సంతాపములో మునిగియున్న ఈమెకు మెల్లిగా ఆశ్వాసమిచ్చెదను'.

'నేను సూక్ష్మరూపములో ఉన్నవాడిని.
అందులోనూ వానరుడను.
ఇప్పుడు సంస్కారముకల మనుష్యుల భాషలో మాట్లాడెదను.
నేను ద్విజులుమాట్లాడే సంస్కృతములో మాట్లాడినచో
నన్ను రావణుడా అనే శంకతో సీత భయపడును.
ప్రత్యేకముగా వానరుడు ఇట్లు ఎలామాట్లాడునూ అని.
అందువలన అవశ్యముగా మనుష్యుల భాషలో అర్థవంతముగా మాట్లాడవలెను.
లేకపోతే ఈమెను శాంతపరచుట సంభవము కాదు'.

' ముందే రాక్షసులవలన భయపడిన ఈ సీత
నా రూపము భాష చూచి మళ్ళీ భయపడును.
అప్పుడు ఆ మనస్విని నన్ను కామరూపుడగు రావణుడు అని భావించి,
భయముతో ఒక పెద్ద శబ్దము చేయును.
సీత చేత చేయబడిన శబ్దముతో
యమునిలా భయంకరముగా వున్న రాక్షసీ గణములు గుమిగూడెదరు.
అప్పుడు ఆ వికృతాననలు చుట్టుముట్టి నన్ను బంధించుటకు కాని
వధించుటకు గాని ప్రయత్నము చేసెదరు.
మంచి కొమ్మలను మహావృక్షముల కొమ్మలనూ పట్టుకొని ,
చెట్లకొమ్మలమీద ఎగురుతూ పరుగెడుతున్న నన్నుచూసి
వారు భయ సందేహములు కలవారగుదురు.
వికృతాననలు అగు రాక్షసులు వనములో విచరించుచున్న,
నా మహత్ రూపము చూచి భయపడిపోయెదరు'.

' అప్పుడు ఆ రాక్షసులు రాక్షసేంద్రుని వాసములో
రాక్షసేంద్రుని చే నియుక్తులైన రాక్షస వీరులను కూడా ఆహ్వానించెదరు.
అప్పుడు ఆ రాక్షసువీరులు శూలములు శక్తులూ ఖడ్గములూ పట్టుకొని ఉద్వేగముతో వచ్చెదరు.
వారిచే చుట్టబడి వారి బలమును విరోధిస్తూ
నేను ఆ మహాసాగరము అవతలి తీరము చేరలేకపోవచ్చు.
శీఘ్రముగా వెళ్ళు చాలామంది రాక్షసులు నన్ను బంధించవచ్చు.
ఈమెకు రాముని సందేశము అందకపోవును.
నేను కూడా బంధింపబడిన వాడగుదును.
హింసలో రుచిగల వారు అయిన ఆ రాక్షసులు ఈ జనకాత్మజను హింసించెదరు.
అప్పుడు రామ సుగ్రీవుల కార్యము విఫలము అగును'.

' జానకి బందీగా రాక్షసుల కాపలాలో వున్నది.
ఇది సాగరముతో చుట్టబడిన రహస్యమైన ప్రదేశము.
నేను రాక్షసులతో జరిగిన యుద్ధములో మరణించినా పట్టుకోబడినా,
రామునికి సహాయము చేయగల వారు ఎవరూ లేరు.
నేను చనిపోతే ఈ శతయోజన విస్తీర్ణము గల మహా సాగరము దాటగల వానరుడు నాకు కనపడుట లేదు.
వేయిమంది రాక్షసులను హతమార్చుటకు నాకు సమర్థత ఉన్నది.
కాని సంగ్రామము తరువాత అ మహాసాగరపు అవతలి తీరము చేరగల శక్తి ఉండకపోవచ్చు.
యుద్ధములోని నిశ్చితా అనిశ్చితాలమీద నాకు ఇష్టము లేదు.
ఏ ప్రజ్ఞాశాలి సంశయముతో కూడిన కార్యము తీసుకొనును?'

'మాటలాడక పోతే వైదేహి ప్రాణత్యాగము చేయవచ్చు.
సీతదేవి తో మాట్లాడినా కూడా ప్రమాదము కలగవచ్చు".

' దేశకాల విరోధములతో వివేకహీనుడైన దూతచే అర్థవంతమైన కార్యములు కూడా
సూర్యోదయముచే నాశనము చేయబడిన చీకటిలాగా నాశనము అవును.
అర్థము అనర్థము మధ్యలో నిశ్చయమైన బుద్ధి కూడా శోభించదు.
తమని తాము పండితులము అనుకునే దూతలు కార్యములను అనర్థము చేయుదురు'.

'కార్యము ఎట్లు చెడకుండా ఉండాలి?
బుద్ధిని ఎట్లు హీనముకాకుండా చేయగలము?
సముద్ర లంఘనము ఎట్లు వృధాకాకూడదు?
నామాటలవలన సీత ఎట్లు భయపడకుండావుండునట్లు చేయగలను?"

ఈ విధముగా ఆలోచించి హనుమ ఒక నిర్ణయముకు వచ్చెను.

' ఎటువంటి క్లిష్టకర్మలైనా సాధించగల సమర్థుడు అగు రాముని కీర్తిస్తూ,
రాముని యందే లగ్నమైన మనస్సు గల ఈమెను భయపెట్టజాలను.
ఇక్ష్వాకులలో వరిష్ఠుడు ఆత్మను ఎరిగినవాడు అగు రాముని,
శుభవచనములను మధురమైనమాటలతో కీర్తించెదను.
ఈ విధముగా ఆమెకు నాపట్ల విశ్వసమును పెంపొందించెదను'.

ఈ విధముగా ఆలోచించి
అప్పుడు మహానుభావుడైన ఆ హనుమంతుడు
ఆ చెట్టుకొమ్మలమధ్యలో కూర్చుని
అ జగత్పతి యొక్క భార్యని చూస్తూ మధురమైన వాక్యములతో
రాముని కీర్తిస్తూ పలుకసాగెను.

అప్పుడు హనుమంతుడు పలికేది రామకథ.
రామకథా ప్రసంగమువలన అంతరాయములు కలుగవు.
హనుమంతుడు సముద్ర లంఘనములో మైనాకుడు అడ్డుపడినప్పుడు,
సురస అడ్డుపడినప్పుడు వెంటనే తన కర్తవ్యమును
అంటే క్లుప్తముగా రామకథను చెపుతాడు.

ఇక్కడ కూడా అలాగే సీతాదేవికి ఊరట కలగడానికి రామకథ చెపుతాడు .
అదే రామకథా ప్రభావము.
అదే ఈ ముప్పదియవ సర్గలో అంతరార్ధము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||